Hyderabad KBR Park: వాక్‌వేలో కుక్క పిల్లలను చంపిన బాలుడు

24 Nov, 2021 15:08 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో తిరుగుతున్న ఓ బాలుడు గడిచిన నాలుగైదు రోజుల నుంచి ఇక్కడి పెంపుడు కుక్కలపై దాడి చేస్తూ వాటిని కొడుతూ చంపేందుకు యత్నిస్తున్నాడంటూ ఓ వాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ విధుల్లో ఉన్న ఇంటర్‌సెప్టర్‌ వెహికిల్‌ పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు. వివరాలివీ... కేబీఆర్‌ పార్కు సమీపంలోని ఓ బస్తీలో నివసించే 16 ఏళ్ల బాలుడు కుక్కలను రాళ్లతో కొట్టి చంపేస్తున్నాడని ఓ మహిళా వాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చదవండి:  సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని...

అక్కడే ఉన్న ఇంటర్‌ సెప్టర్‌ వెహికిల్‌ కానిస్టేబుల్‌ కె.బి.అక్షయ్‌కుమార్, నరేష్‌తో పాటు హోంగార్డులు జి.నారాయణరెడ్డి, వెంకటేష్‌ తదితరులు ఘటన స్థలానికి వెళ్లి మూడు కుక్క పిల్లలు చనిపోయినట్లుగా గుర్తించారు. మరో కుక్కపిల్ల దాడిలో గాయపడగా దాన్ని రక్షించారు. ఈ కుక్క పిల్లలపై దాడి చేసి చంపేసిన బాలుడు కొద్దిదూరంలోనే కర్రలతో పావురాల గుంపుపై దాడి చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

చదవండి: Tomato Price In Hyderabad: కూరలు కుతకుత.. టమాటా ఒకటే అనుకుంటే పొరపాటే.. ఈ పట్టిక చూడండి

పోలీసులు బాలుడికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. వారం రోజుల తర్వాతా బాలుడి మానసిక స్థితిలో మార్పు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా ఈ బాలుడు పార్కు లోపల, బయట ఆవారాగా తిరుగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాళ్లతో, కర్రలతో జంతువులు, పక్షులపై దాడి చేస్తున్నట్లుగా వాకర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు