వరుస ఘటనలు.. హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

14 Jul, 2022 12:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో ఒకేసారి భారీ స్థాయిలో ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 69 మందికి స్థాన చలనం కల్పిస్తూ కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన కొన్నేళ్లుగా నగరంలో బదిలీలు జరుగుతున్నప్పటికీ గరిష్టంగా ఐదు స్థానాలకే పరిమితం అవుతున్నాయి. ఆనంద్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారులు, సిబ్బంది పనితీరు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. 

వివిధ మార్గాల్లో, అనేక కోణాల్లో సమాచారం సేకరించి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో పనితీరు, సీనియారిటీ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎం.నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేసిన ఆనంద్‌ ఆ స్థానంలో సీసీఎస్‌ నుంచి సి.హరి చంద్రారెడ్డిని నియమించారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ఇద్దరి అధికారులు కొత్త స్థానాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరిగి పాత స్థానాల్లోకి మారాల్చి వచ్చింది. తాజా బదిలీల్లో మళ్లీ యథాతధంగా పోస్టింగ్స్‌ వచ్చాయి.
చదవండి: ఖైదీ నెంబర్‌ 2001.. నాగేశ్వర్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు

కాగా ఇటీవల నగర పోలీసు అధికారుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మారేడుపల్లి సీ నాగేశ్వరరావు అత్యాచారం కేసులో ఇరుక్కోగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి ఓ యువతిని మోసం చేసిన ఘటనలో మల్కాజ్‌గిరిలో సీసీఎస్‌ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్‌పై కేసు నమోదైంది. ఇలా పోలీసు అధికారులకు సంబంధించి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ ఈ బదిలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
చదవండి: హిమాయత్‌ సాగర్‌: ప్రమాదకర విన్యాసాలతో యువకులు

మరిన్ని వార్తలు