Badangpet Corporation Mayor: టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన బడంగ్‌పేట మేయర్‌.. కాంగ్రెస్‌లో చేరిక

4 Jul, 2022 09:43 IST|Sakshi

నేడు హస్తినలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్‌పేట కార్పొరేషన్‌ అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్‌ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన తాను ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు.

అప్పటి నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డామని, అంకితభావంతో సేవలు అందించామన్నారు. ఆత్మాభిమానం చంపుకోలేకే టీఆర్‌ఎస్‌ను వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మేయర్‌తో పాటు 23వ కార్పొరేటర్‌ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెద్దబావి సుదర్శన్‌రెడ్డి సైతం టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. వీరంతా సోమవారం హస్తినలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.   

మరిన్ని వార్తలు