Hyderabad: కమాండ్‌ కంట్రల్‌ సెంటర్‌ వద్ద సరికొత్త బారికేడింగ్‌

7 Nov, 2022 14:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం కొనసాగుతున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వివిధ రాజకీయ పార్టీల ధర్నాలు, ఆందోళనలు కొనసాగే అవకాశాన్ని గుర్తించిన అధికారులు పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఎలాంటి ఆందోళనలకు తావు లేకుండా, ఎవరూ లోనికి దూసుకురాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు.

శనివారం బీజేపీ కార్యకర్తలు, నేతలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ముట్టడికి యత్నించగా వారిని సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పక్కా ప్రణాళికతో కమాండ్‌ కంట్రల్‌ సెంటర్‌ వద్దకు రాకుండానే వారిని నియంత్రించారు. ఇందుకోసం సరికొత్త బారికేడింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా పికెటింగ్‌లు కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ కూడా ఆధునిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆందోళనకారులు ముందుకు రాకుండా నిరోధించేందుకు ఈ కొత్త బారికేడింగ్‌ సిస్టమ్‌ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. 

సీబీఆర్‌టీ పరీక్ష నేపథ్యంలో 144 సెక్షన్‌ అమలు 
హిమాయత్‌నగర్‌:  సీబీఆర్‌టీ పరీక్షల నేపథ్యంలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. సీబీఆర్‌టీ పరీక్ష కేంద్రాల వద్ద సుమారు 500 అడుగుల మేర నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తప్పవంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా ఆయా పోలీసు స్టేషన్‌ల సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం 6 గంటల పాటు, మంగళవారం 6 గంటల పాటు ట్విన్‌ సిటీస్‌లో టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్‌ సెంటర్స్‌లో సీబీఆర్‌టీ ఎగ్జామ్‌ జరుగుతున్నట్లు తెలిపారు. పరీక్షకు ఏవిధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: డీఏవీ స్కూల్‌ ఉదంతం నేపథ్యంలో ప్రైవేట్‌ స్కూళ్లపై ప్రత్యేక నజర్‌)

మరిన్ని వార్తలు