Hyderabad Fire Accident: గోడౌన్‌లో అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని దిగ్భ్రాంతి

23 Mar, 2022 08:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బోయిగూడలోని స్క్రాప్‌ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి మంత్రి తలసాని చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంఘటన చాలా బాధాకరమని, మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా కృషి చేసినప్పటికీ భారీగా ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు.

ఉదయం మూడున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని, అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులకు ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు