హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు..

7 Jun, 2022 07:57 IST|Sakshi

భాగ్యనగరానికి ఉత్సవ శోభ 

ఈ నెల 30న గోల్కొండ బోనాలు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 30వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో  ఆషాఢ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న గోల్కొండ బోనాలు, జూలై 17న సికింద్రాబాద్‌ బోనాలు, 18న రంగం, జూలై 24న హైదరాబాద్‌ బోనాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూలై 25న ఘటాల ఊరేగింపు జరగనుంది.

బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ దేవాలయాలతో పాటు 3 వేల ప్రైవేట్‌ దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్‌ విభాగం ఆధ్వర్యంలో పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు. సుమారు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయ న తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య  సీసీ కెమెరాలతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తామన్నారు.

సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, విద్యుత్‌ శాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ సునీల్‌ శర్మ, హోం శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ రవి గుప్తా, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కమి షనర్‌ అనిల్‌కుమార్, జీహెచ్‌ంఎసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జిల్లా కలెక్టర్‌ శర్మన్, పోలీస్‌ కమిషనర్లు సీవీ.ఆనంద్, మహేష్‌ భగవత్, స్టీఫెన్‌ రవీంద్ర, కల్చరల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, మహంకాళి దేవాలయం, గోల్కొండ దేవాలయం, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.
చదవండి: చట్ట పరిధిలో తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: రఘునందన్‌

మరిన్ని వార్తలు