మినహాయింపు వేళల్లో రోడ్లపైకి భారీగా జనం
ఎక్కడా కనిపించని భౌతిక దూరం, శానిటైజేషన్
దాదాపు సగం మంది మాస్కులు ధరించని వారే..
చోద్యం చూస్తున్న మూడు కమిషనరేట్ల పోలీసులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్య విభాగం అధికారులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వారాంతపు సంతలు, హోల్సేల్ మార్కెట్లే కాదు.. దాదాపు ప్రతి దుకాణమూ కరోనా హాట్స్పాట్గా మారే ప్రమాదం కనిపిస్తోంది. నిత్యావసరాల ఖరీదుతో పాటు ఇతర అవసరాల కోసం నగరవాసులు ఒక్కసారిగా బయటకు వస్తుండటమే దీనికి కారణం. కొన్ని ప్రాంతాల్లో పోలీసుల కదలికలే కనిపించట్లేదు. మరికొన్ని చోట్ల ఉంటున్నా.. చోద్యం చూస్తున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో ఎక్కడ చూసినా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. శనివారం నుంచి మాత్రం లాక్డౌన్ అమలు, నిబంధనల పాటింపు విషయంలో సీరియస్గా ఉంటామని అధికారులు చెబుతు న్నారు. ప్రస్తుతం ఉన్న వైఖరిలో మార్పు రాకుంటే లాక్డౌన్ అమలులో ఉన్నా.. కేసులు మాత్రం భారీ గా పెరుగుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
సమయం తక్కువనుకుంటూ..
సడలింపులోనే పనులన్నీ
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఆంక్షల సడలింపు వ్యవధిలోనే అత్యవసర పనులన్నీ పూర్తి చేసుకునేందుకు నగర వాసులు ఇంటి నుంచి బయటికి రావడంతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. లాక్డౌన్ మూడోరోజు శుక్రవారం కూడా ఉదయం 5.30 గంటల నుంచి 10 గంటల వరకు జన సందడి కొనసాగింది. రంజాన్ పండగ కావడంతో తెల్లవారుజాము నుంచే మార్కెట్లు కిటకిటలాడాయి.
నిత్యావసరాలకు రెక్కలు
లాక్డౌన్ విధించి మూడురోజుల గడవక ముందే నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యాపారులు స్టాక్ లేదంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దాదాపు పది శాతం పెంచి విక్రయిస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయం తక్కువగా ఉండటంతో వినియోగదారులు అధిక ధరలను సైతం భరించక తప్పడం లేదు. మాల్స్తో పాటు కిరాణా షాపుల్లో సైతం ఇదే పరిస్ధితి నెలకొంది. మరోవైపు మెడికల్ షాపుల్లో సైతం వివిధ మందులను ఎమార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అధికారులు పలు మాల్స్, కిరాణా షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
నేటి నుంచి కఠినతరం..
లాక్డౌన్ అమలులోకి వచ్చాక తొలి మూడు రోజులు కొంత ఉదాసీనంగా వ్యవహరించిన మాట వాస్తవమే అని పోలీసులు అంగీకరిస్తున్నారు. ఈ సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించడానికి, వ్యాపారులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికీ ప్రాధాన్యమిచ్చామని చెబుతున్నారు. శనివారం నుంచి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.