హైదరాబాద్‌: మియాపూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్ల పరిస్థితి విషమం.. గొంతు కోసుకుని..

13 Dec, 2022 12:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమోన్మాదం మరోసారి పడగ విప్పింది. నగరంలోని మియాపూర్‌ ఆదిత్యానగర్‌ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. తనను దూరం పెడుతుందనే కోపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం.

ఇక దాడి సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని తీవ్రంగా గాయపర్చాడు ఆ ప్రేమోన్మాది.  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం తాను గొంతు కోసుకుని ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.  

బాధితురాలిని వైభవిగా, తల్లి శోభగా గుర్తించారు. వాళ్లను చికిత్స కోసం కొండాపూర్‌ కిమ్స్‌కు తరలించారు. మరోవైపు ప్రేమోన్మాది సందీప్‌ అలియాస్‌ బబ్లూను చికిత్స కోసం గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. బబ్లూ స్వస్థం రేపల్లెగా గుర్తించారు. 

రేపల్లెకు చెందిన సందీప్ కుమార్ అలియాస్ బబ్లూ, వైభవికి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రెండేళ్ల  నుండి బబ్లూని దూరం పెడుతూ వస్తోంది వైభవి. ఫోన్‌ నెంబర్‌ సైతం బ్లాక్‌ చేయడంతో.. వేరే నెంబర్లతో కాల్ చేసి తనతో మాట్లాడాలని వేధించసాగాడు బబ్లూ. మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. 

ఈ మే నెలలో రేపల్లె నుండి హైదరాబాద్ వచ్చి ఆదిత్య నగర్ లో తన తల్లి, సోదరుడితో ఉంటోంది  వైభవి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన సందీప్‌.. నేరుగా వైభవి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలోనే వైభవితోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకున్నాడు సందీప్‌. 

మరిన్ని వార్తలు