Hyderabad: ఇక వీకెండ్‌ షీ టీమ్స్‌.. ఈ ప్రాంతాల్లో ఫోకస్‌

6 Jun, 2022 18:12 IST|Sakshi

ఐటీ ఆఫీసుల పునఃప్రారంభం నేపథ్యంలో

అర్ధరాత్రి డెకాయ్‌ ఆపరేషన్స్‌

సైబరాబాద్‌ షీ టీమ్‌ స్పెషల్‌ ఫోకస్‌

మహిళలను వేధించే పోకిరీలకు అరదండాలు

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ నుంచి ఆఫీస్‌ వైపు క్రమంగా మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగుల రాక పెరిగిపోయింది. ఇదే సమయంలో మహిళా ఉద్యోగులకు రక్షణ, భద్రత కల్పించేందుకు సైబరాబాద్‌ షీ టీమ్‌ బృందాలు సిద్ధమయ్యాయి. బృందాల సంఖ్యను పెంచడంతో పాటు, మఫ్టీలో గస్తీ కాస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. విదేశీ సంస్థలకు సేవలందించే చాలా వరకు ఐటీ కంపెనీలు 24 గంటలు పని చేస్తుంటాయి. దీంతో రాత్రి వేళలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాయి. కీలక ప్రాంతాల్లో తిష్ట వేసుకునే అల్లరి మూకల ఆగడాలను కట్టించేందుకు ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ విభాగం ప్రత్యేకంగా వీకెండ్‌ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. 


పెరిగిన షీ టీమ్స్‌.. 

మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సైబరాబాద్‌ పోలీసులు గతంలో నాలుగు షీ టీమ్స్‌ ఉండగా.. వాటి సంఖ్యను 11కు పెంచారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌ ఫిర్యాదు అందిన క్షణాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చర్యలు తీసుకుంటున్నారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వీకెండ్‌ షీ టీమ్స్‌ మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. మహిళలను కామెంట్‌ చేసినా, అసభ్యకరంగా ప్రవర్తించినా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని చర్యలు తీసుకుంటున్నారు. షీ టీమ్స్‌కు తోడుకు పెట్రోలింగ్‌ సిబ్బంది ఉంటూ అర్ధరాత్రి హల్‌చల్‌ చేసే పోకిరీల ఆటకట్టిస్తున్నారు. 

ఈ ప్రాంతాల్లో ఫోకస్‌.. 
ఐటీ కారిడార్‌లో షీ టీమ్స్‌ ఎక్కువగా ఫోకస్‌ పెట్టాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లి, మియాపూర్, చందానగర్, మాదాపూర్‌ ప్రాంతాల్లోని ఫుడ్‌ కోర్ట్‌లు, లేడిస్‌ హాస్టల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి పలు ప్రాంతాలలో షీ టీమ్స్‌ ప్రత్యేక దృష్టిసారించాయి. (క్లిక్‌: ఆమ్నీషియా పబ్ కేసు.. మరో అమ్మాయిపైనా వేధింపులు!)

మరిన్ని వార్తలు