-

ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. విడిపోవడానికి కూతురు అడ్డొస్తుందని..

2 May, 2022 15:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జగిత్యాల: మానవత్వం లేని తండ్రి బిడ్డను వదిలించుకోవాలని చూశాడు. పేగుతెంచుకు పుట్టిన బిడ్డ కనిపించక పోవడంతో తల్లి కంటి మీద కునుకులేకుండా వెదికింది. చివరికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బిడ్డ ఎక్కడుందో గుర్తించి పోలీసుల సాయంతో అక్కున చేర్చుకుంది. ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన సాయి, చైతన్యను ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకునాడు..వీరికి ఐదేళ్ల పాప లక్కీ. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరికీ తరచూ గొడవ లవుతున్నాయి. చైతన్యతో ఎలాగైనా విడిపోవాలని సాయి నిర్ణయించుకున్నాడు.

విడిపోవడానికి పాప లక్కీ అడ్డొచ్చే ప్రమాదం ఉందని భావించాడు. తాము విడిపోతున్నామని, పాపను పెంచుకోవాలని.. పిల్లల్లేక బాధపడుతున్న జగిత్యాలలోని విద్యా నగర్‌కు చెందిన తన స్నేహితుడు క్రాంతి, కవిత దంపతులకు లక్కీని అప్పగించాడు. బిడ్డ కనిపించకపోయేసరికి...‘పాపను ఏం చేశావు’ అంటూ భర్తను నిలదీసింది చైతన్య. ‘అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, హాస్టల్‌లో చేర్చాను’ అంటూ అబద్ధాలు చెప్పాడు. భార్య ఒత్తిడి చేయడంతో ఫోన్‌ ఆఫ్‌ చేసిన సాయి.. తప్పించుకుని తిరుగుతున్నాడు. హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన చైతన్య...సామాజిక మాధ్యమాల్లోనూ వెదకడం మొదలుపెట్టింది.

తన కూతురు జగిత్యాలకు చెందిన కవితతో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తించి, జగిత్యాలకు చేరుకుంది. క్రాంతి, కవితల అడ్రస్‌ కనుక్కొని, కవిత జగిత్యాల ప్రభు త్వాస్పత్రిలో పనిచేస్తున్నట్లు గుర్తించి.. వెళ్లి తన పాపను తనకు ఇవ్వాలంటూ వేడుకొంది. బిడ్డ తనను గుర్తించలేక పోవడంతో... స్థానిక సీఐ కిశోర్‌ ను కలిసి సమస్యను వివరించింది. చైతన్య, క్రాంతి, కవితలను విచారించిన సీఐ... పాపను చైతన్య బిడ్డగా నిర్ధారించారు. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు విచారణలో ఉందని, చైతన్య ఆమె బిడ్డ లక్కీ, క్రాంతి–కవితలను అక్కడికి పంపించారు. బిడ్డ దొరకడంతో చైతన్య సంతోషానికి అవధులు లేవు. 
చదవండి: Hyderabad: ఇంట్లో నుంచి ప్రేమికుల పరార్‌.. ఇద్దరి జాడ చెప్పాలంటూ..

మరిన్ని వార్తలు