వాటర్‌ ప్లస్‌ సిటీ: హైదరాబాద్‌కు అరుదైన గుర్తింపు

21 Aug, 2021 13:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరానికి అరుదైన గుర్తింపు దక్కింది. జీహెచ్‌ఎంసీ సిగలో మరో నగ చేరింది. వాటర్‌ ప్లస్‌ సిటీగా హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటించిన వాటర్‌ ప్లస్‌ నగరాల జాబితాలో హైదరాబాద్‌ పేరు చోటుచేసుకుంది.  దీంతో.. తెలంగాణలో ఈ గుర్తింపు పొందిన తొలి కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది.

కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ మిషన్‌కు సంబంధించి ఆయా నగరాల్లో అమలవుతున్న కొన్ని కార్యక్రమాలను గుర్తించి, ధ్రువీకరిస్తుంది. వీటిల్లో ఓడీఎఫ్, ఓడీఎఫ్‌ ప్లస్, ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్, వాటర్‌ ప్లస్‌ ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌ గుర్తింపు కూడా పొందింది. జలమండలి, హెచ్‌ఎండీఏలు ఏర్పాటు చేసిన సీవరేజి ట్రీట్‌మెంట్‌ప్లాంట్ల (ఎస్టీపీ) వల్ల జీహెచ్‌ఎంసీకి ఈ గుర్తింపు లభించింది.  

772 ఎంఎల్‌డీల నీరు ట్రీట్‌..  
జలమండలి 25 ఎస్టీపీలు, హెచ్‌ఎండీఏ 3 ఎస్టీపీలను ఏర్పాటు చేసి ఇళ్లు, వాణిజ్య భవనాలు, వివిధ సంస్థల నుంచి వెలువడుతున్న వ్యర్థ నీటిని ట్రీట్‌ చేసి బయటకు వదులుతున్నాయి. ఇలా 772 ఎంఎల్‌డీల నీరు ఎస్టీపీల ద్వారా ట్రీట్‌ అవుతోంది. ఇలా చేశాక ఈ నీటిని అవెన్యూ ప్లాంటేషన్‌కు, పార్కుల్లో, ఫుట్‌పాత్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణాల పనుల్లో, పబ్లిక్‌ టాయిలెట్స్‌కు, దిగువ ప్రాంతాలోన్లి వ్యవసాయ అవసరాలకు పునర్వియోగిస్తున్నారు. జలసంరక్షణ, నీటి పునరి్వయోగం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా జీహెచ్‌ఎంసీ, జలమండలి, హెచ్‌ఎండీఏలు పని చేస్తున్నాయి. ట్రీట్‌ చేయని వ్యర్థజలాలను పర్యావరణంలోకి విడుదల చేయరాదనే లక్ష్యంతో వాటర్‌ప్లస్‌ అంశాన్ని స్వచ్ఛ భారత్‌ ర్యాంకింగ్‌లలో చేర్చారు. 

స్వచ్ఛభారత్‌ ర్యాంకింగ్‌కు ఈసారి మొత్తం 6 వేల మార్కులుండగా, ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌ గుర్తింపునకు 500 మార్కులు, వాటర్‌ ప్లస్‌ గుర్తింపునకు 200 మార్కులు వెరసీ.. 700 మార్కులు జీహెచ్‌ఎంసీకి లభించినట్లేనని సంబంధిత అధికారి తెలిపారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ బహిరంగ మల, మూత్ర విసర్జన లేని (ఓడీఎఫ్‌) నగరాలకు అవి కల్పించిన సదుపాయాలను బట్టి  ఓడీఎఫ్, ఓడీఎఫ్‌ ప్లస్, ఓడీఎఫ్‌ డబుల్‌ప్లస్‌  నగరాలుగా గుర్తింపునిస్తుంది.  

ఓడీఎఫ్‌ డబుల్‌ ప్లస్‌తో పాటు వ్యర్థజలాలు ట్రీట్‌ చేసి, విడుదల చేసి కనీసం 25 శాతం పునరి్వనియోగించే నగరాలకు వాటర్‌ప్లస్‌ నగరంగా గుర్తింపునిస్తుందని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఈ గుర్తింపు రావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేస్తూ నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ ఎల్లప్పుడూ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. నగరానికి ఈ గుర్తింపు రావడంపై మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
చదవండి: సీఎంఆర్‌ఎఫ్‌కు సన్‌ నెట్‌వర్క్‌ రూ.3 కోట్లు విరాళం
రైట్.. రైట్.. గచ్చిబౌలి టు శంషాబాద్‌

మరిన్ని వార్తలు