Hyderabad: శెభాష్‌ జునియా!  సాహస బాలికకు నేషనల్‌ బ్రేవరీ అవార్డు

26 Jan, 2023 09:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ (అల్వాల్‌): ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించింది అల్వాల్‌కు చెందిన జునియా ఈవ్‌లిన్‌. బాలిక జునియా ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ (ఐసీసీడబ్యూ) సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని అందజేసింది. గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జునియా ఈవ్‌లిన్‌కు ఈ నెల 17న ఢిల్లీలో పురస్కారాన్ని అందజేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి భయందోళనకు గురికాకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, తమ్ముడిని కాపాడుకోవడంతోపాటు తోటివారిని రక్షించించి సాహస బాలల పురస్కారాన్ని అందుకుంది.

వివరాలివీ...
మచ్చబొల్లారంలో నివసించే జోసఫ్‌రాయ్, అభిజేర్‌ల కుమార్తె జునియా ఆవ్‌లిన్‌(14) అల్వాల్‌లోని సెయింట్‌ మైఖేల్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2022 ఆగస్టు 15న జునియా తన తండ్రి, తమ్ముడితో కలిసి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో జునియా తలకు గాయమైంది. తండ్రి అపస్మారక స్థితికి చేరాడు. తమ్ముడు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సమయంలో జునియా ధైర్యాన్ని కోల్పోకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, సోదరుడికి సపర్యలు చేసి వారు స్పృహలోకి వచ్చేలా చేసింది.

అనంతరం ఆటోలో ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించింది. మరో ప్రయాణికురాలు, ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించి సఫలం అయింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జునియా తలకు అయిన గాయానికి మూడు కుట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని జునియా ఈవ్‌లిన్‌కు అందజేసింది. తన కూతురి ధైర్య సాహసానికి గర్వపడుతున్నానని ఈ సందర్భంగా తండ్రి జోçసఫ్‌రాయ్‌ ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు