గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ హఠాన్మరణం 

14 Jan, 2023 14:26 IST|Sakshi
బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందిన బీజేపీ నేత 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ సీనియర్‌ నాయకుడు, గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ (55) హఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి ఇంట్లో మనవడితో ఆడుకుంటూ ఉల్లాసంగా ఉన్న కరుణాకర్‌ ఒక్కసారిగా కుర్చీలో నుంచి కిందపడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అంబులెన్స్‌లో సిటీన్యూరో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని వైద్యులు నిర్ధారించి చికిత్స అందించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆయన మృతదేహాన్ని గుడిమల్కాపూర్‌లోని స్వగృహంలో ఉంచగా పార్టీ నేతలు, కార్యకర్తలు సందర్శించారు. కాగా కరుణాకర్‌ రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా, ఆయన భార్య దీప ఓ పర్యాయం కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి, కార్వాన్‌ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేశారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు బంధువే కాకుండా అత్యంత సన్నిహితుడు. కరుణాకర్‌కు భార్య దీప, కుమారుడు దేవర వంశీ ఉన్నారు. కాగా గత రెండేళ్ల క్రితం ఆయన ఏకైక కుమార్తె దేవర భవానీ మృతి చెందారు.  

నివాళులర్పించిన మంత్రి తలసాని 
దేవర కరుణాకర్‌ మృతి చెందిన విషయం తెలుసుకుని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గుడిమల్కాపూర్‌కు వచ్చేసి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసమస్యలపై గళమెత్తే నాయకుడని బల్దియా సమావేశాలలో ప్రజల మౌళిక సదుపాయాల కోసం ఆయన నిరంతరం ప్రశ్నించే వారని అన్నారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్, నగర మాజీ మేయర్‌ మహ్మద్‌ మాజిద్‌ హుస్సేన్, నగరానికి చెందిన వివిధ డివిజన్‌ల బీజేపీ కార్పొరేటర్లు కరుణాకర్‌ మృతదేహానికి నివాళులు అరి్పంచారు.  

మరిన్ని వార్తలు