HYD: ఐస్‌క్రీం చాలెంజ్‌.. ఐస్​క్రీం తిని ఫ్లేవర్ చెప్తే చాలు.. రూ. లక్ష మీవే..

13 May, 2022 10:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైబిజ్‌ టీవీ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్‌ ఇండియా ఐస్‌క్రీం టేస్టింగ్‌ చాలెంజ్‌’ నిర్వహిస్తున్నట్లు హైబిజ్‌ టీవీ ఎండీ రాజగోపాల్‌ తెలిపారు. గురువారం గోల్కొండ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్‌ ఐస్‌క్రీం మాన్యుఫ్రాక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధీర్‌షా, దొడ్ల డెయిరీ ఐసీక్రీమ్స్‌ ప్రతినిధి అజయ్‌ సింహాలతో కలిసి ఆయన  వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న హైటెక్స్‌లో ఈ ఛాలెంజ్‌ నిర్వహిస్తున్నామని, కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీం రుచి చూసి నగదు బహుమతిని గెలుచుకోవచ్చునన్నారు.

ఈ సందర్భంగా నటి, మిస్‌ఇండియా–2018 స్పందన కళ్లకు గంతలు కట్టుకుని ఏ విధంగా ఐస్‌క్రీం రుచి చూడాలో చేసి చూపించారు. మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండో బహుమతి రూ.50 వేలు, ఉత్తమ ప్రతిభ కనబరచిన 25 మందికి రూ. 10 వేల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో పలు ఫ్లేవర్ల ఐస్‌క్రీంలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ చాలెంజ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చునని రూ. 150 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 8340974747 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
చదవండి: రూ. కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్‌.. ‘వన్‌ ప్లస్‌’తో చిక్కాడు!   

మరిన్ని వార్తలు