ఐపీఓవై–2022కు హైదరాబాద్‌ ఆతిథ్యం 

29 Jan, 2022 03:38 IST|Sakshi

గచ్చిబౌలి: ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌(ఐపీఓవై) అవార్డులకు ఎంపికైన హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు రానుందని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్, హెచ్‌ఎండీఏ కార్యదర్శి బి.ఎం.సంతోష్‌ పేర్కొన్నారు. శుక్రవారం నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్‌ కార్యాలయంలో మీడియాతో ఐపీవోవై–2022 వివరాలను ఆయన వెల్లడించారు. ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్స్‌కు ఆతిథ్య నగరంగా హైదరాబాద్‌ ఎంపికైందన్నారు.

65 దేశాల నుంచి 5 వేల మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఫొటో జర్నలిజం, డాక్యుమెంటరీ, ట్రావెల్‌ అండ్‌ నేచర్, వైల్డ్‌ లైఫ్, స్ట్రీట్, పోర్ర్‌టెయిట్, వెడ్డింగ్, మొబైల్స్‌ తదితర 8 విభాగాల్లో అవార్డులు ఇస్తారని తెలిపారు. ఐపీఎఫ్‌ (ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్‌) వ్యవస్థాపకులు అక్విన్‌ మాథ్యూస్‌ మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్లను ప్రత్యేక కేటగిరీగా చేర్చామన్నారు. మార్చి 21 నుంచి ప్రపంచ వ్యాప్త ఫొటోగ్రాఫర్ల నుంచి ఎంట్రీలను స్వీకరిస్తారన్నారు. విజేతల ప్రకటన ఆగస్టు 15, అవార్డుల ప్రదానం హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 10న ఉంటుందని తెలిపారు. రూ.25 లక్షలు నగదు, కెమెరాలను గెలుచుకునే అవకాశం ఫొటోగ్రాఫర్లకు ఉంటుందన్నారు.  

మరిన్ని వార్తలు