Hyderabad: మెట్రో రైల్‌ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

3 Dec, 2021 16:40 IST|Sakshi

మెట్రోలో ఇంటర్నెట్‌ ఉచితం

వినోద, విద్యా విభాగాలకు ఈ–కామర్స్, ఫిన్‌టెక్‌ జోడింపు 

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మెట్రో రైల్‌ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గురువారం అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో స్టేషన్లతో పాటు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ట్రైన్స్‌ అన్నింటా షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్స్‌ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్నెట్‌కు వెన్నెముకగా నిలిచే హైపర్‌ లోకస్‌ ఎడ్జ్‌ క్లౌడ్‌ ఆధారిత సాంకేతికత రూపశిల్పి షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్స్‌ ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌తో భాగస్వామ్యం చేసుకుని డిజిటల్‌ కనెక్టివిటీని మరింతగా మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలో దేశంలోనే తొలి ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్‌ మెట్రో రైల్‌ తమ ప్రయాణికులకు కంటెంట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్, స్ట్రీమ్‌ చేసుకునే అవకాశాన్ని ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకున్నా అందిస్తుంది. దీంతో వినోదం, విద్య, ఈ– కామర్స్, ఫిన్‌టెక్‌ విభాగాలలో కంటెంట్‌ను పొందవచ్చు. 


విమానాలలో ఏ విధంగా అయితే సేవలు లభ్యమవుతాయో అదే రీతిలో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల నగరంలో షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్స్‌ నిర్వహించిన అధ్యయనంలో మెట్రో రైల్‌ ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని దాదాపు 60 నిమిషాలు తమ ఫోన్లలోనే గడుపుతున్నట్టు వెల్లడైంది. నేపథ్యంలో షుగర్‌ బాక్స్‌ యాప్‌ ప్రయాణ సమయంలో రెండవ అత్యంత ప్రాధాన్యతా యాప్‌గా నిలిచింది. (చదవండి: ఐఐటీ హైదరాబాద్‌.. నియామకాల్లో జోరు)


ప్రయాణికులకు వారి ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన సేవలను అందించగలుగుతున్నామని షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్స్‌ కో ఫౌండర్, సీఈవో రోహిత్‌ పరాంజపీ చెప్పారు. హైదరాబాద్‌ స్మార్ట్‌ నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఓ అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఎల్‌ అండ్‌ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఎండీ, సీఈఓ కేవీబీరెడ్డి తెలిపారు. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు)

మరిన్ని వార్తలు