Hyderabad: కొత్త సంవత్సరం కానుక.. కొత్తగూడ ఫ్లై ఓవర్‌ ప్రారంభించిన కేటీఆర్

1 Jan, 2023 16:28 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలు  తీర్చడానికి.. సిగ్నల్‌ లేని ప్రయాణానికి మార్గం సుగమమం చేసేందుకు మరో ఫ్లైఓవర్‌ కొత్త సంవత్సర కానుకగా ప్రజలకు  అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను మునిసిపల్‌ ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదివారం ప్రారంభించారు. దీనిద్వారా ఆల్విన్‌కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్‌ లేని ప్రయాణం చేసేందుకు మార్గం సుగమమైంది.  

ఫ్లై ఓవర్‌ వివరాలు..
రూ.263.09 కోట్ల వ్యయంతో  ఫ్లైఓవర్‌ నిర్మాణం 
ఫ్లై ఓవర్‌తోపాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్‌ 
ఫ్లైఓవర్‌ పొడవు దాదాపు 3 కి.మీ. 
2, 3, 4, 5 లేన్లుగా గ్రేడ్‌ సెపరేటర్‌గా నిర్మాణం 
ఎస్సార్‌డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో ఇది 18వ ఫ్లైఓవర్‌ 
ప్రత్యేక ఆకర్షణగా ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు 

ఉపయోగాలు..
గచ్చిబౌలి వైపు నుంచి ఆలి్వన్‌కాలనీ జంక్షన్‌  వైపు వన్‌వే  ఫ్లైఓవర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు, మసీద్‌బండ, బొటానికల్‌ గార్డెన్‌ నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్‌ పైకి వెళ్తాయి. మాదాపూర్‌ లేదా హఫీజ్‌పేట్‌ వైపు వెళ్లవచ్చు. హఫీజ్‌పేట్‌ నుంచి వచ్చే గచ్చిబౌలి, బొటానికల్‌ గార్డెన్‌ వైపు వెళ్లే వాహనాలు అండర్‌ పాస్‌ ద్వారా వెళ్తాయి. దీంతో శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్, కొత్తగూడ జంక్షన్లపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గనుంది.  
కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్, బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు చేయవచ్చు. 
కొత్తగూడ, కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్లలో వాహనదారులకు ఊరట. 
ఆల్విన్‌ కాలనీ  నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం. 
మాదాపూర్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలివైపు వెళ్లే వారు ఇక సులభంగా రాకపోకలు సాగించే అవకాశం. 
గచ్చిబౌలి కూడలి నుంచి బొటానికల్‌ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆలి్వన్‌కాలనీ, మాదాపూర్‌ ప్రాంతాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం 
ట్రాఫిక్‌ సమస్య, సమయం, వాహనాల ఇంధనం ఖర్చు తగ్గుతాయి.  

ఏర్పాట్ల పరిశీలన.. 
ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ అధికారులతో కలిసి పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు  ఎస్‌ఈ వెంకటరమణ, డీఈ భరద్వాజ్, ఏఈ పరమేష్, ఏఈ శివకృష్ణ, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్, బోస్, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, నర్సింహ్మసాగర్,ఖాజా, రామకృష్ణ  ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
చదవండి: అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్‌ షీ–టీమ్స్‌ ఏర్పాటు

మరిన్ని వార్తలు