కరోనా: పెళ్లి రోజు నాడే ప్రాణాలు విడిచిన పాండు

2 Jun, 2021 20:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ఎంతోమందిని బలితీసుకుంటూ తమ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. తాజాగా పెళ్లిరోజు నాడే ఇంటి పెద్దను పాడె ఎక్కించి కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది. మల్లాపూర్‌లోని నాగలక్ష్మీ కాలనీలో నివాసముంటున్న పాండు.. ఇసుక కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. లక్షణాలు కనిపించకపోవడంతో టెస్ట్‌ చేసుకోవడంతో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉంటూ మందులు తీసుకున్నాడు. అయిదు రోజులపాటు హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఒక రోజుల ముఖం అంతా నల్లగా అవ్వడంతో అనుమానం వచ్చిన తల్లి ఏమైందిరా అని అడిగింది. దీంతో  ఆయాసం, గుండెలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు. తనకేం కాదని ఆ తల్లి కూడా కొడుక్కి దైర్యం చెప్పింది. మరోవైపు ట్రీట్‌మెంట్‌కు ఇబ్బంది కాకుండా డబ్బులు కూడా సమకూర్చుకున్నారు. అప్పు చేసి వైద్యం కోసం మొత్తం రూ. 10-12 లక్షలు ఖర్చు చేసుకున్నారు. ఆసుపత్రిలో చూపించుకున్న పాండు ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వలేదు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.

అదే సమయంలో ఆక్సిజన్‌ కొరత కూడ ఉండటంతో పరిస్తితి మరింత విషమించింది. దీంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనకేం కాదని పెళ్లి రోజు నాటికి ఇంట్లో ఉంటానని పాండు మాటిచ్చాడు. కానీ జరిగింది వేరు. అంతలోనే విషాదం అలుముకుంది. పెళ్లిరోజే పాండు కోవిడ్‌తో మరణించాడు. అతని మరణంతో కుటుంబం అంతా రోడ్డున పడింది. ఇంటి పెద్ద పెళ్లి రోజే పాడే ఎక్కించి కుంటుంబానికి దిక్కులేకుండా చేసింది మాయదారి కరోనా.. మూడు తరాల మనుషులతో కళకళలాడే ఇంటిని కూల్చేసింది. 
 

చదవండి: హృదయ విదారకం: ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదగాథ..

మరిన్ని వార్తలు