డాక్టర్‌ చీటీ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు.. 

8 Aug, 2021 18:30 IST|Sakshi
అరెస్టయిన వెంకటేష్, స్వాధీనం చేసుకున్న ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు

సాక్షి, మల్కాజిగిరి(హైదరాబాద్‌): డాక్టర్‌ ప్రిస్‌క్రిఫ్షన్‌ లేకుండా మత్తు ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. మౌలాలి హెచ్‌బీ కాలనీకి చెందిన భూపతి వెంకటేష్‌ (32) మల్కాజిగిరిలోని మెడ్‌ప్లస్‌ స్టోర్‌ ఇంఛార్జిగా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా డాక్టర్ల చీటీలు లేకుండానే మత్తు ఇంజక్షన్లు, ట్యాబెట్లను కాలేజీ విద్యార్థులతో పాటు రైల్వే స్టేషన్లలో తిరిగే మైనర్లకు విక్రయిస్తున్నాడు.

విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు, డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు దుకాణంపై దాడి చేశారు. అతని వద్ద నుంచి 785 ఇంజక్షన్లు, 585 ట్యాబ్లెట్స్, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి శనివారం వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించామని మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌రావు తెలిపారు.     

మరిన్ని వార్తలు