మార్గదర్శకాలను వివరించిన మెట్రో ఎండీ

5 Sep, 2020 15:53 IST|Sakshi

ప్రతి స్టేషన్‌లో 30-50 సెకన్ల వరకు ఆగుతుంది

సాక్షి, హైదరాబాద్‌: జనతా కర్య్ఫూ నుంచి నిలిచిపోయిన మెట్రో సేవలు ఈ నెల ఏడు నుంచి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌ వీ ఎస్‌ రెడ్డి ప్రయాణికులు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ.. ‘అన్‌లాక్‌ 4కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభిస్తున్నాం. అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి. మార్కింగ్‌కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తాం. నగదు రహిత లావాదేవీలు జరుపుతాం. ప్రయాణికులు ఆన్‌లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలి. ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేనివారు స్టేషన్‌లో కొనుక్కోవాలి. ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతిస్తాం. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుంది’ అని తెలిపారు.(చదవండి: సిటీ బస్సులు లేనట్టేనా?)

ఆయన మాట్లాడుతూ.. ‘ప్రయాణికులు మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్‌తో రావాలి. 75 శాతం ఫ్రెష్ ఎయిర్ ట్రైన్‌లో అందుబాటులో ఉంటుంది. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. ప్రతి స్టేషన్‌లో ఐసోలేషన్ రూంలు ఏర్పాటు చేస్తాం. మొదటి వారంలో రోజుకు 15 వేల మంది ప్రయాణీకులు వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రతి స్టేషన్‌లో మెట్రో రైల్ 30-50 సెకన్లు ఆగుతుంది’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు