నల్సార్‌లో ట్రాన్స్‌జెండర్‌ హాస్టల్‌

28 Mar, 2022 14:41 IST|Sakshi

విద్యార్థుల కోసం ప్రత్యేక వసతి ఏర్పాట్లు

2015లోనే జెండర్‌ గుర్తింపు లేకుండా సర్టిఫికెట్‌ జారీ చేసిన నల్సార్‌ 

నల్సార్‌ వీసీ ఫైజాన్‌ ముస్తఫా వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌జీబీటీక్యూ+ (లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్‌జెండర్, క్వీర్‌ ప్లస్‌ ) విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఒకడుగు ముందుండే నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ (నల్సార్‌) మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. లింగ గుర్తింపు లేనివారి కోసం హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

లేడీస్‌ హాస్టల్‌–6లో ఏర్పాట్లు.. 
నల్సార్‌లో బాలికల హాస్టల్‌–6 భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ను పూర్తిగా లింగ గుర్తింపు లేని (జెండర్‌ న్యూట్రల్‌)వారికోసం కేటాయించారు. అకడమిక్‌ బ్లాక్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో లింగ గుర్తింపు లేనివారి కోసం వాష్‌రూమ్స్‌ను ఏర్పాటు చేశామని నల్సార్‌ వైస్‌ చాన్స్‌లర్‌ ఫైజాన్‌ ముస్తఫా ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. ఇక ‘జెండర్, సెక్సువల్‌ మైనారిటీ’అంశాలపై సమగ్ర విద్యా విధానం కోసం యూనివర్సిటీ ట్రాన్స్‌ పాలసీ కమిటీ ముసాయిదా విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. 

2015 జూన్‌లో నల్సార్‌లోని ఓ 22 ఏళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌లో జెండర్‌ గుర్తింపు వద్దని వర్సిటీ ప్రతినిధులను అభ్యర్థించగా.. ఆ అభ్యర్థనను ఆమోదించి.. సదరు స్టూడెంట్‌ గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌లో జెండర్‌ కాలమ్‌లో మిస్టర్, మిస్‌కి బదులుగా ‘ఎంఎక్స్‌’గా పేర్కొంటూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.  

నల్సార్‌ వర్సిటీకి రూ.1.50 కోట్ల విరాళం
శామీర్‌పేట్‌: నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆండ్‌ బిజినెస్‌ లా(జేఆర్‌సీఐటీబీఎల్‌) అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ఏర్పాటుకు దాత జస్టిస్‌ బీపీ. జీవన్‌రెడ్డి రూ. కోటి 50 లక్షల చెక్కును నగరంలోని ఆయన  నివాసంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారకేంద్రం ఏర్పాటుతో చట్టాల్లో సమకాలిన సమస్యలకు సంబంధించిన బోధన, పరిశోధన చేపట్టే లక్ష్యాలు అయిన సెమినార్లు, ఉపన్యాసాలు, స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.  

నల్సార్‌ అండర్‌ గ్రాడ్యూయేట్, పోస్ట్‌ గ్రాడ్యూయేట్, డాక్టోరల్‌ స్థాయిలో కోర్సులను ప్రారంభించడం, బలోపేతం చేయడం, పరిశోధన, ప్రచురించడానికి విధాన రూపకర్తలతో సహకరించడానికి ఐఎంఎఫ్, ఐబీఆర్‌వో, డబ్ల్యూటీవీ. సీఐఐ, ఎఫ్‌ఐసీసీఐ మొదలైన వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఇంటర్నషిప్‌లను పొందడంలో సహాయం చేయడానికి అధ్యాపక బృందం కృషిచేసిందన్నారు. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి పివి రెడ్డి, జస్టిస్‌ ఎస్‌ఎస్‌ఎం కాద్రీ, జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి, సుప్రీకోర్డు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, పాట్నా హై కోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్‌. నర్సింహారెడ్డి, తెంలగాణ హై కోర్డు న్యాయమూర్తులు ఉజ్వల్‌భూయాన్, రాజశేఖర్‌రెడ్డి,  పి.నవీన్‌రావు, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు