Corona effect: మమ్మల్ని ఎవరూ చూడట్లే..

30 Apr, 2021 08:11 IST|Sakshi

వారం రోజులుగా తగ్గిన చిరువ్యాపారాలు 

కరోనా వైరస్‌ నేపథ్యంలో మే 15 వరకు క్లోజ్‌  

చార్మినార్‌: పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులు లేక వెలవెలబోతున్నాయి. కోవిడ్‌–19 మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న నేపత్యంలో పర్యాటక ప్రాంతాలు మూత పడడమే ఇందుకు ప్రధాన కారణం. కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో భారత పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి మే 15 వరకు చార్మినార్‌ సందర్శనను నిలిపి వేశారు. వారం రోజులుగా చార్మినార్‌ పరిసర ప్రాంతాలతో పాటు సాలార్‌జంగ్‌ మ్యూజియంల వద్ద సందర్శకుల సందడి తగ్గింది. దీంతో చిరువ్యాపారాలు కూడా గణనీయంగా తగ్గి పోయాయి.  


► గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో చార్మినార్‌ కట్టడాన్ని మూసి వేసిన ఏఎస్‌ఐ తిరిగి ఈఏడాది మళ్లీ సందర్శనను నిలిపివేసింది. 
► దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పర్యాటక ప్రాంతమైన చార్మినార్‌ కట్టడంతో పాటు సాలార్‌జంగ్‌ మ్యూజియం సందర్శనను నిలిపి వేశారు.  
►కుతుబ్‌షాహీల కాలంలోని కళాకారుల విశిష్ట కళా నైపుణ్యానికి అద్దంపట్టేలా చార్మినార్‌ కట్టడాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తిలకించడానికి రోజూ సందర్శకులు ఇక్కడికి వస్తుండటంతో చార్మినార్‌ పరిసరాలు సందర్శకులతో సందడిగా కనిపించేవి. 
► వారం రోజులుగా చార్మినార్‌ మూసి వేయడంతో సందర్శకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. 
► ఇక ఇప్పటికే మక్కా మసీదు లోనికి విజిటర్స్‌ను అనుమతించడం లేదు. 
► దీంతో పాతబస్తీ చార్మినార్‌–మక్కా మసీదు రోడ్డులో చిరువ్యాపారాలు తగ్గిపోయాయి. 
► వినియోగదారుల సందడి కనిపించడం లేదు. 

( చదవండి: నకిలీలతో జాగ్రత్త.. మం‍దులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి )

మరిన్ని వార్తలు