గుడ్‌ న్యూస్‌: కోలుకుంటున్నవారి సంఖ్యే అధికం

28 May, 2021 11:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోజుకు నాలుగు వేల మందికి పైనే..

తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు

మంచి ఫలితాలిస్తున్న లాక్‌డౌన్‌

సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నమోదవుతున్న కోవిడ్‌ కేసులతో పోలిస్తే.. ఇప్పటికే వైరస్‌ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు సగటున 3,000 నుంచి 3,500 మంది కొత్తగా కోవిడ్‌ బారిన పడుతుండగా.. 4,500 నుంచి 4,900 మందికిపైగా కోలుకుంటుండటం శుభ పరిణామమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జనరల్, ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 55,120 పడకలు ఉండగా, వీటిలో 23,374 మంది చికిత్స పొందుతున్నారు. మరో 31,746 పడకలు ఖాళీగా ఉన్నాయి. వెంటిలేటర్‌ పడకలకు ఇప్పటికీ అదే డిమాండ్‌ కొనసాగుతున్నప్పటికీ.. జనరల్, ఆక్సిజన్‌ పడకలు భారీగా అందుబాటులో ఉన్నాయి.  

లాక్‌డౌన్‌ ప్రకటనతో..  
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం రెండు వారాలుగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు తెరుచుకున్న సినిమా థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు సహా ఫంక్షన్‌ హాళ్లు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ పూర్తిగా మూతపడ్డాయి. ప్రజా రవాణా స్తంభించడంతో పాటు రహదారులపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఫలితంగా మే మొదటి వారంలో రోజుకు సగ టున ఎనిమిది వేలకుపైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రజల్లోనూ కోవిడ్‌పై భయం ఏర్పడింది. ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే..సెకండ్‌ వేవ్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా కోవిడ్‌ బాధితులుగా మారారు. వైరస్‌ సోకిన వారు కళ్ల ముందే కన్నుమూస్తుండటంతో కుటుంబ సభ్యులు, ఇతరులు అప్రమత్తమవుతున్నారు. వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   

గాంధీ నుంచే రోజుకు 120 మంది డిశ్చార్జీ.. 
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 38,632 యాక్టివ్‌ కేసులు ఉండగా, వీటిలో 23,374 మంది వివిధ ప్రభుత్వ ప్రై వేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 1,250 మందికిపైగా చికిత్స పొందుతుండగా, టిమ్స్‌లో 850 మంది, కింగ్‌కోఠిలో 250 మంది, ఈఎన్‌టీలో 250 మంది, ఛాతీ ఆస్పత్రిలో 200 మంది చికిత్స పొందుతున్నారు. ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ పూర్తి స్థాయిలో పడకలు నిండిపోయాయి. వెంటిలేటర్‌ పడకలకు ఇప్పటికు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. రోగుల రద్దీ తగ్గడంతో ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల్లోని జనరల్, ఆక్సిజన్‌ పడ కలు ఖాళీగా ఉంటున్నాయి. గాంధీ నుంచి రోజుకు సగటున 120 నుంచి 150 మంది డిశ్చార్జీ అవుతుండగా, టిమ్స్‌ నుంచి 50 మంది, కింగ్‌కోఠి నుంచి 25 మంది, ఈఎన్‌టీ నుంచి పది, చెస్ట్‌ నుంచి పది మంది చొప్పున డిశ్చార్జీ అవుతున్నారు. కార్పొరేట్‌ ఆస్ఫత్రుల నుంచి మరో 500 మంది వరకు డిశ్చార్జీ అవుతున్నారు.  

చదవండి: పోలీసుల వీడియో వైరల్‌.. యూనిఫాంలో కొనుగోళ్లు వద్దు! 

 రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదీ.. 

తేదీ కొత్త కేసులు కోలుకున్న వారి సంఖ్య

19

3,837 4,976 
20 3,660  4,826 
21 3,464 4,801
22 3,308 4,723 
23 2,242 4,693
24 3,043 4,305
25 3,821 4,298
26 3,762 3,816

     

మరిన్ని వార్తలు