హైదరాబాద్‌ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ

4 Aug, 2022 14:33 IST|Sakshi

వీ హబ్, టీ హబ్, టీవర్క్స్, టాస్క్‌ ద్వారా ఐటీకి బూస్టప్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఐటీ వృద్ధికి ఓపెన్‌ డేటా సెంటర్లు బూస్టప్‌ ఇస్తున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,423 డేటా సెంటర్లుండగా నగరంలో సుమారు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్‌వర్క్‌ అభివృద్ధితోపాటు వివిధ రకాల సేవల అనుసంధానం, డిజిటల్, సాఫ్ట్‌నెట్‌ సేవలను అందించేందుకు ఈ కేంద్రాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఐటీ రంగానికి కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్‌ సిటీలో టీఎస్‌ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్‌ తదితర సంస్థల ద్వారా స్టార్టప్‌లను ఇతోధికంగా ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లిభించడంతో డిజిటల్‌ సేవలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 17,328 కి.మీ. మార్గంలో కేబుల్‌ లైన్‌ ఏర్పాటైనట్లు తెలిపారు. మరో ఐదు వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 


నలుచెరుగులా విస్తరణకు చర్యలు.. 

నగరం నలుచెరుగులా ఐటీ వృద్ధికి ఐటీ శాఖ చర్యలు ప్రారంభించింది. తాజాగా కండ్లకోయ గేట్‌వే ఐటీ పార్క్‌ విస్తీర్ణాన్ని 6 లక్షల చదరపు అడుగుల నుంచి 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచింది. త్వరలో  ఈ పార్క్‌ నిర్మాణం మొదలు కానుంది. కాగా ఈ పార్క్‌కు సమీపంలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్‌ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. నగరంలో నలు చెరుగులా టెకీలు ఐటీ ఉ ద్యోగాలు చేసేలా  నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు ఐటీ శాఖ చర్యలు చేపట్టడం విశేషం.  


టాప్‌ కంపెనీలకు చిరునామా.. 

ప్రపంచంలోనే టాప్‌ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాప్ట్‌ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. అమెజాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది.  ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో  సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్‌ కంపెనీల్లో సుమారు 7.78  లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే.(క్లిక్‌: కొత్త స్మార్ట్‌ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?)


ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. 

గ్రేటర్‌ పరిధిలో 2014 నుంచి ఐటీ బూమ్‌ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఏటా రూ. 1.83 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటతాయని ఐటీ వర్గాలు అంచనా వేస్తుండడం విశేషం. (క్లిక్‌: హైదరాబాద్‌ పోలీస్‌ ట్విన్‌ టవర్స్‌ ప్రత్యేకలివే..

మరిన్ని వార్తలు