Hyderabad: మెట్రో స్టేషన్‌లో బ్యాగులు తారుమారు.. చివరికి ఏం జరిగిందంటే!

15 Dec, 2022 08:23 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులు తమ విలువైన వస్తువులు పోగొట్టుకున్నా.. వారి చేతులు మారినా మెట్రో సిబ్బంది బాధ్యతతో వ్యవహరించి వాటిని సదరు యజమానులకు అందజేస్తున్నారు. ఇటీవల పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌లో తరచూ మెట్రోలో ప్రయాణించే లిజు జాన్‌ అనే ప్రయాణికుడు ఉదయం 9.30 గంటలకు తన బ్యాగేజీ స్కానింగ్‌కు ఇచ్చే క్రమంలో అది తన  చేతులు మారిందని అతను గుర్తించాడు.

వెంటనే అతను స్టేషన్‌లోని టికెటింగ్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సిబ్బంది లిజు జాన్‌ వద్ద  ఉన్న బ్యాగ్‌ను పరిశీలించి ఆ బ్యాగ్‌లో లభించిన కాంటాక్ట్‌ నంబరుకు ఫోన్‌ చేశారు. దీంతో తన బ్యాగ్‌కు బదులుగా పొరపాటున లిజు జాన్‌ బ్యాగ్‌ను తీసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలు.. 10 నిమిషాలలో పరేడ్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌కు వచ్చి అప్పజెప్పారు. కాగా ఆ మహిళా ప్రయాణికురాలు ఓ న్యాయవాది. ఆమె బ్యాగ్‌లో అతి ముఖ్యమైన కేస్‌ ఫైల్స్‌ ఉండగా, లిజు జాన్‌ బ్యాగ్‌లో ల్యాప్‌టాప్‌లో అతి ముఖ్యమైన ఆఫీస్‌ ఫైల్స్‌ ఉన్నాయి. తమ బ్యాగ్‌లను అందజేసిన మెట్రో సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ  సంఘటనపై లిజు ట్వీట్‌ చేయడంతో నెటిజన్లు మెట్రో సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. 
చదవండి: hyderabad: బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా

మరిన్ని వార్తలు