వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధం

19 Nov, 2021 01:12 IST|Sakshi

హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం 

అత్యవసరంగా విచారించాలన్న 

అభ్యర్థనకు హైకోర్టు నో

సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేట పూర్వ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన జె.శంకర్, ఆంథోల్‌ ప్రాంతానికి చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ ఆర్‌.సుబేందర్‌ సింగ్‌లు గురువారం ఈ పిల్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భోజన విరామం తర్వాత విచారించాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు.

దీనికి ధర్మాస నం నిరాకరించింది. ‘వెంకట్రామిరెడ్డి 2011లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. ఐఏఎస్‌ అధికారుల నియామకాలు చేపట్టేది రాష్ట్రపతి. వారు కేంద్ర ప్రభుత్వ అ«దీనంలో ఉంటూ.. విధులు నిర్వహిస్తారు. వారి రాజీనామా ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఐఏఎస్‌ అధికారులు రాజీనామా చేయడానికి 3 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలి. వెంకట్రామిరెడ్డి రాజీనామాతో ఆయనపై ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేవని నిర్ధారిస్తూ విజిలెన్స్‌ విభాగం నివేదికను జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన దరఖాస్తును కేంద్రానికి పంపాలి. వీటన్నింటినీ పరిశీలించకుండా రాజీనామా ఆమోదించడం చట్టవిరుద్ధం.

అయితే వెంకట్రామిరెడ్డి 14న స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే అదే రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించినట్లుగా పత్రికల్లో కథనాలొచ్చాయి. వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరి 16న ఎంఎల్‌సీ అభ్యరి్థగా నామినేషన్‌ దాఖలు చేశారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ తిరస్కరించేలా ఆదేశించండి’ అని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌లో కేంద్ర పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, తెలంగాణ శాసన మండలి కార్యదర్శి, ఎంఎల్‌సీ ఎన్నికల రిటర్నింగ్, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో పి.వెంకట్రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. 

మరిన్ని వార్తలు