ఘట్‌కేసర్‌: కాలేజీ వాట్సాప్‌ గ్రూపుల్లో బీటెక్‌ స్టూడెంట్స్‌ ఫేక్‌ న్యూడ్‌ ఫొటోలు.. తీవ్ర ఆందోళన

5 Jan, 2023 13:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థినుల మార్పింగ్‌ న్యూడ్‌ ఫొటోల కలకలం చెలరేగింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి కొందరు ఆకతాయి.. వాటిని వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి కాలేజ్‌ ముందుకు చేరి ధర్నా చేపట్టారు. ఈ ఉదయం వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.

ఘట్‌కేసర్‌ వీబీఐటీ( విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీ) దగ్గర గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫొటోలను సేకరించి.. వాటిని న్యూడ్‌ ఫొటోలుగా మార్ఫింగ్‌ చేశారు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారు. వాటిని చూపిస్తూ.. వాట్సాప్‌ గ్రూపుల్లో చేరి వీడియో కాల్స్‌ చేయాలని యువతులను బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామం వెనుక ఎవరున్నారేది తేల్చే పనిలో ఉన్నారు. అయితే.. ఈ లోపే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

మరోవైపు ఈ పరిణామంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కూతుర్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఇదిలా ఉండగా.. విద్యార్థినుల ధర్నా చేపట్టిన సమయంలో ఆగంతకుల నుంచి వార్నింగ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు