హైదరాబాద్‌లో పోలీసుల ఓవర్‌యాక్షన్‌! బైకు విషయంలో గొడవ.. 3 గంటలపాటు టార్చర్‌

6 Jun, 2022 12:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులంటే రక్షక భటులని, ప్రజలను కాపాడాల్సి బాధ్యత వారిపై ఉంటుందని అంటుంటారు. ఈ మాటలని నిజం చేస్తూ కొందరు నిజాయితీగా పని చేస్తూ పతకాలు, ప్రమోషన్లు సాధిస్తుంటే, మరికొందరు పోలీసులు మాత్రం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో మూడు గంటల పాటు ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు కొందరు పోలీసులు. పొడుగాటి దుడ్డుకర్రతో గుచ్చుతూ ఇష్టానుసారంగా దాడి చేసి, ఆఖరికి వ్యక్తి కాలు విరగొట్టారు. ఈ ఘటన సికింద్రాబాద్ మెట్టుగూడలో చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ లాలాగూడ చెందిన సూర్య ఆరోక్యరాజ్ (25) జిమ్ నడిపస్తున్నాడు. ఈనెల 3న రాత్రి ఇంటి వద్ద బస్తీలో ఓ వ్యక్తికి ఇతనికి ఇద్దరి మధ్య బైకు విషయంపై గొడవ జరిగింది. ఆ వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురు కానిస్టేబుళ్లు.. సూర్య ఇంటి వద్దకు వెళ్లి తమతో స్టేషన్‌కి రావాలని ఆదేశించారు. అయితేరాత్రి 11 గంటలు అవుతుందని, ఉదయాన్నే వస్తానని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ నలుగురు పోలీసులు సూర్యపై ఇష్టానుసారంగా దాడి చేశారు.

మాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ దుడ్రుకర్రను రెండు కాళ్ల మధ్య ఉంచి బూటు కాళ్లతో తొక్కుతూ చిత్రహింసలు పెట్టారు. సూర్య తల్లి తన కొడుకును కొట్టకండని పోలీసుల్ని ఎంత ప్రాధేయ పడుతున్నప్పటికీ అతనిపై కనికరం చూపకుండా చితకబాదేసి వెళ్లిపోయారు. పేదరికం కారణంగా మందులు కొనుక్కోలేని పరిస్థితి వాళ్లది. సూర్య ఎడమ కాలు విరిగిపోగా, కుడి కాలుకు తీవ్ర గాయం ఏర్పడింది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్విటర్‌లో కేటీఆర్‌ ప్రశ్నల వర్షం

మరిన్ని వార్తలు