Hyderabad: మౌనిక గర్భవతి కావడంతో ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా

17 Jun, 2022 08:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందని బాధితులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక  (31) భార్యాభర్తలు. కాగా శ్రీకాంత్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ ఆల్వాల్‌లోని సాయిబాబానగర్‌లో నివాసముంటున్నాడు.

మౌనిక గర్భవతి కావడంతో ప్రసవం కోసం ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్‌సీఏల్‌ నార్త్‌లో ఉన్న అంకుర ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఉదయం నుంచి మౌనిక ఆరోగ్యంగానే ఉందని చెప్పిన వైద్యులు సాయంత్రం ఆపరేషన్‌ థియేటర్‌లో ఫిట్స్‌ రావడంతో గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. దీంతో ఆందోళన చెందిన మౌనిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: Hyderabad: జాగ్రత్త సుమా!.. అధికారులకు కేటీఆర్‌ హెచ్చరిక..

మరిన్ని వార్తలు