Hyderabad Railway Station: నాంపల్లి స్టేషన్‌ కాడా... 

5 May, 2021 20:10 IST|Sakshi

‘తత్కాల్‌ టికెట్ల’లో దళారుల దందా

టికెట్ల కోసం ప్రయాణికుల నుంచి భారీగా వసూళ్లు 

హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌లో టోకెన్ల విధానానికి స్వస్తి 

సాక్షి, హైదరాబాద్‌ : ఓవైపు కోవిడ్‌ విజృంభణ... మరోవైపు ప్రజల్లో మళ్లీ లాక్‌డౌన్‌ భయాలు... వెరసి నగరం నుంచి చాలామంది సొంతూళ్లకు బయల్దేరి వెళ్లిపోతున్నారు. ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకుని రైళ్లలో వెళ్లిపోయేవారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు కానీ తత్కాల్‌ టికెట్ల ద్వారా బుక్‌చేసుకుని వెళ్లానుకునే ప్రయాణికులకు మాత్రం ‘తత్కాల్‌ టికెట్ల దందా’చుక్కలు చూపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ (నాంపల్లి)లో తత్కాల్‌ టికెట్ల దందా అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. 

గతంలో తత్కాల్‌ టికెట్‌ను పొందేందుకు రైల్వే రిజర్వేషన్‌ కేంద్రానికి వచ్చిన వారికి టోకెన్లను అందజేసేది. ఈ టోకెన్ల కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్‌ వద్ద రాత్రంతా జాగారం చేసేవారు. అయితే ఈ టోకెన్ల విధానానికి హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ స్వస్తి పలికింది. తత్కాల్‌ టికెట్‌ జారీ చేసే సమయానికి క్యూలో నిలబడిన వారిని తోసుకుని ఎవరెవరో ముందుకొచ్చేసి టికెట్‌ తీసేసుకుంటున్నారు.


క్యూలో నిలబడిన వారందరికీ టికెట్‌ మాత్రం లభించడం లేదు. దీంతో ఎలాగైనా ప్రయాణం చేయాలనుకునేవారు తత్కాల్‌ టికెట్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల అవసరాన్ని అదునుగా తీసుకున్న దళారులు రెట్టింపు ధరలతో వారి నుంచి వసూలు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధి కారులు తత్కాల్‌ టికెట్ల జారీపై దళారుల ప్రమేయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.  

ఇక్కడ చదవండి:
ఆక్సిజన్‌ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే: సీఎస్‌

వెంటిలేటర్‌ బెడ్స్‌ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి!

మరిన్ని వార్తలు