అంధురాలు ఆవేదన.. గూడు లేకుండా చేశారయ్యా!

7 Jul, 2022 19:13 IST|Sakshi

రహమత్‌నగర్‌: తన నివాసం తొలగించడం పట్ల ఓ అంధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అందించిన పట్టా ప్రకారం కేటాయించిన స్థలంలోనే నివాసం నిర్మించుకున్నా.. కొంత మంది బస్తీ నాయకులు రెవెన్యూ సిబ్బందికి తప్పుడు సమాచారం అందించి తన నివాసాన్ని కూల్చివేయించారని అంధురాలైన చంద్రమ్మ వాపోయింది. ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రమ్మ మాట్లాడుతూ... అంధురాలైన తన విజ్ఞప్తి మేరకు 1993వ సంవత్సరంలో తహసీల్దార్‌ తనకు ఫాం డీ పట్టాను (ఎఫ్‌.4477.93) అందజేశారన్నారు.

ఈ క్రమంలోనే రాజీవ్‌ గాంధీనగర్‌లోని తనకు కేటాయించిన 89 ప్లాట్‌లోనే చిన్న షెడ్డు వేసుకుని తన కుమార్తెతో కలిసి జీవిస్తున్నానని తెలిపింది. అయితే కొంత మంది బస్తీ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో రెవెన్యూ సిబ్బంది తాను నివాసం ఉంటున్న షెడ్డును తొలగించారని ఆమె వాపోయింది. తన పేరున ఇచ్చిన పట్టా ఉండగా తన నివాసం ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. అంధురాలైన తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్‌ సి.ఎన్‌.రెడ్డిలకు చంద్రమ్మ విజ్ఞప్తి చేసింది.  

మరిన్ని వార్తలు