35 కంపెనీలు.. 3 వేల పోస్టులు

1 Mar, 2021 16:37 IST|Sakshi

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): నగర మహిళల భద్రతకే కాదు.. వారి ఆర్థిక పురోభివృద్ధికి షీటీమ్‌ పాటుపడుతోంది. షీ టీమ్‌ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ఆవరణలో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నగరమహిళల కోసమే ఏర్పాటు చేసిన జాబ్‌కనెక్ట్‌ కార్యక్రమమే అందుకు తాజా ఉదాహరణ. ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేలమంది నగర మహిళలు పాల్గొనగా 35 కంపెనీలలో మూడు వేలమంది నిరుద్యోగ మహిళలు ఉద్యోగాలు దక్కించుకున్నారు. 

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు, రిక్రూటర్లు పాల్గొని ఇంటర్వ్యూ లు నిర్వహించారు. సుమారు 3 వేల ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలలో పలువురు ఆఫర్‌ లెటర్లు అందుకు న్నారు. పోలీసులు, ట్రైనింగ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (టీఎంఐఎస్‌) సంయుక్తంగా చేపట్టిన ఈ తొలి ప్రయత్నానికి నగర మహిళల నుంచి భారీ స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ రమేశ్, అదనపు సీపీ షికాగోయెల్, షీటీమ్‌ అదనపు డీసీపీ శిరీష ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాబ్‌కనెక్ట్‌ ద్వారా ఉద్యోగులు పొందిన నిరుద్యోగ యువతులు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో ఉద్యోగాలు పొందడం ద్వారా నిరుద్యోగుల ఆనందం రెట్టింపు అవుతుందన్నారు.  

చదవండి:
టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు!

ఆదర్శం నుంచి అధోగతికి!

మరిన్ని వార్తలు