ట్యాంక్‌బండ్‌: కదులుతున్న కారులో మంటలు..

27 Mar, 2021 12:12 IST|Sakshi

ట్యాంక్‌బండ్‌ బోట్స్ క్లబ్ వద్ద ఘటన

సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళుతున్న ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ట్యాంక్‌బండ్‌పై వెళ్తున్న కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు, పాదచారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు వెనక ప్రయాణిస్తున్న వారు దానిలో నుంచి మంటలు రావడం గమనించి.. కారులో ప్రయాణిస్తున్న వారికి ఈ విషయం చెప్పారు. దాంతో వారు కారును ఆపి వెంటనే కిందకి దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ బోట్స్ క్లబ్ వద్ద జరిగింది.  

వివరాల్లోకి వెళితే ఆర్‌పీ రోడ్‌లో నివాసముండే టి విజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి. శుక్రవారం మధ్యాహ్నం విజయ్ కుమార్ అతని భార్యతో కలిసి ఓపెల్ కోర్స కారు నెంబర్ ఏపీ 10 క్యు 2888లో సచివాలయం సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్తుండగా హోటల్ మారియట్ దాటి సెయిలింగ్ క్లబ్ వద్దకు రాగానే కారు వెనక నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతడి కారు వెనక ప్రయాణం చేస్తున్న వారు దీని గురించి విజయ్‌ కుమార్‌కు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన విజయ్ కుమార్, అతడి భార్య వెంటనే కారు దిగి పోయారు.

కారు మంటల్లో కాలి పోతుందని ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదని విజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ ఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్, రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ సరిహద్దులో జరిగింది. ఈ సరిహద్దు తమది కాదంటే తమది కాదంటూ పోలీసులు చెప్పడంతో షాక్‌కు గురైన విజయ్ కుమార్ చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది.

చదవండి: ట్యాంక్‌బండ్‌పై పల్టీ కొట్టిన కారు..

మరిన్ని వార్తలు