అమ్మానాన్న వేధిస్తున్నారు.. కాపాడండి ప్లీజ్‌!

7 Jun, 2022 15:48 IST|Sakshi
కమిషన్‌ను ఆశ్రయించిన బాధితుడు

తల్లిదండ్రులపై హెచ్చార్సీలో కుమారుడి  ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ  కుమారుడు సోమవారం తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను(హెచ్చార్సీ) ఆశ్రయించాడు. మహబూబాబాద్‌ జిల్లా, ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలె శ్రీనివాస్‌ హైదరాబాదులో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు మాలె సత్యనారాయణ, మాలె సత్యవతి ఊరిలో ఉన్న ఆస్తులను అమ్మేసి, మళ్లీ డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

తాను బ్యాంకు రుణం తీసుకుని ఎంసీఏ పూర్తి చేశానని, పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ వాయిదాలు కట్టుకుంటున్నట్లు తెలిపాడు. అయితే తన తల్లిదండ్రులు ఆస్తులు అమ్మడమే కాకుండా అప్పులయ్యాయని చెప్పడంతో గత ఏడాది రూ. 22 లక్షలు నగదు ఇచ్చానని, మళ్లీ రూ.15 లక్షలు ఇవ్వాలని తల్లిదండ్రులు వేధిస్తున్నారన్నాడు. వారి కారణంగా బ్రెయిన్‌ టీబీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మానసికంగా వేధిస్తున్న తల్లిదండ్రులపై, ఎల్లంపేట సర్పంచ్, మరిపెడ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కమిషన్‌ను కోరాడు.

మరిన్ని వార్తలు