రూల్స్‌కి విరుద్ధం.. హైదరాబాద్‌ ఎంపీ ఒవైసీకి రెండు ఓట్లు!.. కాంగ్రెస్‌ ఫిర్యాదు

7 Jan, 2023 07:20 IST|Sakshi

వేర్వేరు చిరునామాలతో నమోదు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించిన ఓటరు జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్‌ ఒవైసీకి రెండు వేర్వేరు చిరునామాలతో రెండు చోట్ల ఓట్లున్నట్టు తేలింది. సాధారణ పౌరులకు ఇలా ఉన్నట్టు అడపాదడపా వినడం సాధారణమే అయినా.. ఒక ఎంపీకి నిబంధనలకు విరుద్ధంగా రెండు చోట్ల ఓటర్ల జాబితా లో పేరుండటం చర్చనీయాంశమైంది.

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ (ఎపిక్‌ నంబర్‌) టీడీజడ్‌1557521తో హైదర్‌గూడ ఉర్దూ హాల్‌ లేన్‌ చిరునామాతో మదీనా హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఒక ఓటుంది. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎపిక్‌ నంబర్‌ కేజీవై0601229తో మైలార్‌దేవ్‌పల్లిలో సెయింట్‌ ఫియాజ్‌ స్కూల్‌ పోలింగ్‌స్టేషన్‌లో మరో ఓటుంది. 

ఎన్నికల సంఘానికి టీపీసీసీ ఫిర్యాదు
ఈ పరిణామాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధమేనని వాదిస్తోంది. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి రెండు చోట్ల ఓటు హక్కు ఉండటంపై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.   

మరిన్ని వార్తలు