టీఎస్‌పీఎస్సీ బోర్డు సమావేశం

23 Apr, 2022 03:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్‌–1తో పాటు వివిధ కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలపై టీఎస్‌పీఎస్సీ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో శనివారం జరిగే బోర్డు సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.

గ్రూప్‌–1 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు టీఎస్‌పీఎస్సీకి చేరాయి. వీటిలో కొన్ని శాఖలకు సంబంధించి ప్రతిపాదనల్లో సవరణలు కోరగా.. వాటిని ఆయా శాఖలు సమర్పించినట్లు తెలిసింది. అవన్నీ సరిగ్గా ఉంటే ఉద్యోగ ప్రకటనకు ఇబ్బందులు ఉండవు. బోర్డు సమావేశంలో కోరం ఆమోదంతో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలుంటాయి. శనివారం సమావేశంలో తీసుకునే నిర్ణయంతో నోటిఫికేషన్లపై స్పష్టత రానుంది. 

మరిన్ని వార్తలు