-

హైదరాబాద్‌: అదిరిపోయే ఆఫర్లును ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ.. రూ.50 చెల్లిస్తే..

9 Mar, 2023 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఎండీగా  వీసీ స‌జ్జ‌నార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్‌ పని తీరుతో ఆకట్టుకుంటున్నారు. టీఎస్‌ఆర్టీసీ ప్రమోట్‌ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు.

కొత్త ఆఫర్‌ వచ్చేసింది..
గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ప్ర‌యాణించే వారి కోసం ఆర్టీసీ ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట సరికొత్త ఆఫ‌ర్ల‌ను ప్యాసింజర్లకు కోసం తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ఆవిష్క‌రించారు. టీ-6 ఆఫర్‌ ఏంటంటే.. మ‌హిళ‌లు, సీనియ‌ర్ సిటిజ‌న్ల టీ-6ని ఉపయోగించుకోవచ్చు. వీళ్లు రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. 6 గంట‌ల పాటు (అనగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) సిటీ ఆర్డినరీ బస్‌ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బ‌స్సుల్లో ప్ర‌యాణించవచ్చు.

ఎఫ్-24 .. కుటుంబ స‌భ్యులు, లేదా స్నేహితుల కోసం ఈ టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది శనివారం, ఆదివారం, సెలవు దినాలలో వర్తిస్తుంది. రూ. 300 చెల్లించి ఈ టికెట్‌పై 4 వ్య‌క్తులు రోజంతా సిటీ ఆర్డినరీ బస్‌ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పించారు. గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. వారిలో 55.50 లక్షల మంది T-24 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు