-

Hyderabad: తాగునీటి సరఫరా నిలిపివేతలో స్వల్ప మార్పులు

7 Mar, 2023 10:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై (జీడీడబ్య్లూఎస్‌ఎస్‌) ఫేజ్‌ – 1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్‌ పల్లి వద్ద చేపట్టాల్సిన గోదావరి మెయిన్‌ 3000 ఎంఎం డయా పంపింగ్‌ మెయిన్‌ పైపు లైన్‌ బ్రిడ్జ్‌ పాసింగ్‌ – బైపాసింగ్, ఇంటర్‌ కనెక్షన్‌ పనులను 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్‌ వెల్లడించారు.

హోలీ పండగ నేపథ్యంలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు  ఈ నెల 8వ తేదీకి బదులు 9వ తేదీ గురువారం ఉదయం 6 నుంచి 11వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్‌  ప్రధాన కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటి సరఫరా అంతరాయానికి సంబంధించి జీఎంలు తమ పరిధిలో  కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా 24 గంటలు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు.

చదవండి: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే..?

మరిన్ని వార్తలు