యువకుడితో సహజీవనం.. పెళ్లికి నో చెప్పిందని వివాహిత కుమారుడిని

17 Jun, 2022 08:46 IST|Sakshi
కిడ్నాప్‌కు గురైన బాలుడు, కిడ్నాపర్‌ శంకర్‌

సాక్షి, బంజారాహిల్స్‌: పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఓ వివాహిత కుమారుడిని కిడ్నాప్‌ చేసిన యువకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. బబ్బుగూడలో నివసించే షేక్‌ తబస్సుమ్‌(24) భర్తతో విడిపోయి ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా రహ్మత్‌నగర్‌లో పని చేస్తోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. తన ఇంటి సమీపంలోనే నివసించే శంకర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త గత మూడు నెలలుగా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు.

ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకోవాలంటూ శంకర్‌ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడ్డట్లు శంకర్‌పై అభియోగాలు ఉండటంతో పెళ్లికి నిరాకరించింది. కక్ష పెంచుకున్న శంకర్‌ బాధితురాలు రహ్మత్‌నగర్‌లో ఓ కార్యక్రమంలో ఉండగా తనతో పాటు వచ్చిన రెండేళ్ల కుమారుడిని  ఎత్తికెళ్లినట్లు ఆమె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు శంకర్‌పై  కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నాందేడ్‌లో ఉన్నట్లుగా ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు. నాందేడ్‌కు ఒక పోలీస్‌ బృందం గురువారం వెళ్లింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి

మరిన్ని వార్తలు