దేవునితోనైనా కొట్లాడుతా!

2 Oct, 2020 01:49 IST|Sakshi

రాష్ట్రంలో వ్యవసాయం, రైతులను కాపాడుకుంటాం..

కృష్ణా, గోదావరిలో హక్కుగా వచ్చే ప్రతి బొట్టును వాడుకుంటాం

అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో వాదనలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసి పట్టుకొని తెలంగాణ బీళ్లను సస్యశ్యామ లం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో C హక్కుగా వచ్చే ప్రతి నీటి బొటునూ వినియోగించుకొని తీరుతామన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య నదీ జలాల అంశంపై 6న జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఈ దిశగా బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో ఖరారు చేశారు. ‘తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగింది.

స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పండుగ వాతావరణం నెలకొంది. పంటల దిగుబడిలో తెలం గాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడు. తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారింది’ అని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు అబ్రహం, సురేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, నీటి పారుదలశాఖ సలహాదారు ఎస్‌కే జోషి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు