TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన

26 Apr, 2023 12:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఉపరితల ద్రోణి కారణంగా రేపు.. మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడుతాయని పేర్కొంది. ఇక, బుధవారం మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా.. బుధవారం తెల్లవారుజామున జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ధరూర్‌ మండలం నీలహళ్లిలో పిడుగుపాటుకు రైతు నర్సింహులుకు చెందిన రెండు ఎద్దులు మృతిచెందాయి. 

ఇదిలా ఉండగా.. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు  ద్రోణి కొనసాగుతోంది. దీంతో, దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి దిగువ స్థాయిలోని గాలులు వీస్తున్నాయి. దీంతో, రాగల మూడు రోజులు తెలంగాణలో మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాగల ఐదు రోజులు రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అవుతాయి. కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా అక్కడక్కడ  నమోదు అయ్యే అవకాశముంది. ఇక నేడు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి  గంటకు 40 నుండి 50కిమీ) వేగంతో పాటు వడగళ్ళతో కూడిన వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  
 

మరిన్ని వార్తలు