వైద్య విద్యార్థుల స్టైపెండ్‌ పెంపు

28 May, 2023 03:28 IST|Sakshi

15 శాతం పెంచిన వైద్య, ఆరోగ్య శాఖ

ఈ ఏడాది జనవరి నుంచే అమలు 

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యార్థులకు శుభవార్త. వారి నెలవారీ స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. సగటున 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హౌస్‌ సర్జన్లతో పాటు పీజీ మెడికల్, పీజీ డిప్లొమా, సూపర్‌ స్పెషాలిటీ, సీనియర్‌ రెసిడెంట్లకు ఇస్తున్న స్టైపెండ్‌ను పెంచుతూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ ఏడాది జనవరి నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు స్టైఫండ్‌ పెంపు ప్రక్రిను వేగంగా పూర్తి చేసి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇలావుండగా స్టైపెండ్‌ పెంపు నిర్ణయంపై తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కౌశిక్‌ కుమార్‌ పింజర్ల, ఆర్‌కే అనిల్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి తదితరులకు జూడా తరపున కృతజ్ఞతలు తెలిపారు. 
 

>
మరిన్ని వార్తలు