మేఘాల  దారుల్లో... వియత్నాంకు సైతం..

22 Jul, 2022 07:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు భారీగా పెరిగాయి. కోవిడ్‌కు ముందున్న అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు మరిన్ని సర్వీసులు నేరుగా అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాల్లో  విశేషంగా ఆకర్షిస్తున్న హైదరాబాద్‌ మహానగరంపై అన్ని దేశాలూ దృష్టి సారించాయి. దీంతో అనేక దేశాల నుంచి నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌కి ఆసక్తి చూపిస్తున్నాయి.

గతంలో హైదరాబాద్‌ నుంచి దుబాయ్, సౌదీ, ఖతార్‌ వంటి అరబ్‌ దేశాలకు మాత్రమే విమానాలు నడిచాయి. కోవిడ్‌ దృష్ట్యా ఆయా సరీ్వసులపై కూడా ఆంక్షలు విధించారు. కరోనా అనంతరం క్రమంగా  12 దేశాలకు  మొదట సర్వీసులను పునరుద్ధరించగా ఇప్పుడు కొత్తగా మరిన్ని దేశాలకు నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగింది. దీంతో  18కి పైగా దేశాలకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి  రావడం గమనార్హం.  

కోవిడ్‌కు ముందు.. తర్వాత.. 

  • ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన అనుసంధానంగా ఉన్న హైదరాబాద్‌  మహానగరం నుంచి దేశీయంగా, అంతర్జాతీయంగా ఏటా రాకపోకలు  పెరగడంతో విమానాశ్రయం విస్తరణ పనులు చేపట్టారు. అంతర్జాతీయ విమానాలు రాకపోకల కోసం రెండేళ్ల  క్రితమే అదనపు టరి్మనల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. కాగా.. కోవిడ్‌ కారణంగా అన్ని రకాల పౌర విమానయాన సేవలు నిలిచిపోయిన సంగతి  తెలిసిందే. 
  • కోవిడ్‌ కాలంలో  అత్యవసర సర్వీసులు మాత్రమే నడిపారు. ఈ ఏడాది ఆంక్షలను సడలించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దేశీయ గమ్యస్థానాల సంఖ్య  అసాధారణంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు 55 గమ్యస్థానాలకు మాత్రమే డొమెస్టిక్‌  సర్వీసులు నడిచాయి. కోవిడ్‌ తర్వాత 15 నగరాలకు మొదటీ సర్వీసులను పునరుద్ధరించారు. ఇప్పుడు ఏకంగా 70కి పైగా డొమెస్టిక్‌ గమ్యస్థానాలకు అనుసంధానం పెరిగింది. కొత్తగా గుల్బర్గా,  హుబ్లీ తదితర నగరాలకు సర్వీసులు  ప్రారంభమయ్యాయి. 
  • కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకు విమాన సర్వీసులను జోడించారు. ఈ సర్వీసులకు  ప్రయాణికుల నుంచి అసాధారణమైన  స్పందన లభించింది. త్వరలో హైదరాబాద్‌ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇటీవల థాయ్‌ స్మైల్‌ ఎయిర్‌లైన్స్‌ హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్‌ విమాన సరీ్వసును పునరుద్ధరించింది. అలాగే ఎయిర్‌ ఏషియా  హైదరాబాద్‌–కౌలాలంపూర్‌ విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించింది. దీంతో ఈ ఏడాది  అబుదాబి, బహ్రెయిన్, కొలంబో, సింగపూర్, దుబాయ్, దోహా, లండన్, జెడ్డా, రియాద్, కౌలాలంపూర్, కువైట్, మస్కట్, షార్జా, బ్యాంకాక్, చికాగో, మాలే, ఢాకా నగరాలకు డైరెక్ట్‌ ఫ్లైట్‌లు అందుబాటులోకి వచ్చాయి.  

(చదవండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం)

మరిన్ని వార్తలు