రష్యా అగ్ని పర్వతంపై మెరిసిన త్రివర్ణం 

17 Sep, 2022 03:24 IST|Sakshi

మానుకోట గిరిజన యువకుడి జయకేతనం   

మరిపెడరూరల్‌/ముషీరాబాద్‌: గిరిజన సాహసికుడు యశ్వంత్‌ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. రష్యాలోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్‌ అగ్ని పర్వతాన్ని అధిరోహించాడు. పర్వత శ్రేణిపై భారత జాతీయ పతకాన్ని ఎగురవేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటాడు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన భూక్య రాంమ్మూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు యశ్వంత్‌కు చిన్నప్పటి నుంచే పర్వతారోహణ అంటే ఇష్టం.

గతేడాది జూన్‌లో జమ్మూకశ్మీర్‌లోని 5,602 మీటర్ల ఎత్తయిన ఖార్డుంగ్‌లా పర్వతాన్ని, ఆగస్టులో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ఈ ఏడాది జూన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఎత్తయిన యునామ్‌ మంచు పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ క్రమంలో ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ కంపెనీ వారు యశ్వంత్‌ను రష్యాలోని మౌంట్‌ ఎల్బ్రస్‌ పర్వతారోహణకు ఎంపిక చేశారు. యశ్వంత్‌ 5,642 మీటర్ల ఎత్తయిన ఈ అగ్ని పర్వతాన్ని ఇటీవలే అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.  

మరిన్ని వార్తలు