కాంబోడియా వస్తున్నారా.. జర జాగ్రత్త! 

23 Sep, 2022 01:00 IST|Sakshi

భారత దౌత్యకార్యాలయం  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉపాధి, పర్యాటకం నిమిత్తం కాంబోడియాను సందర్శించాలనుకునేవారు కన్సల్టెన్సీ లేదా సంస్థ లేదా కంపెనీ నేపథ్యాన్ని సరిచూసుకోవాలని కాంబోడియాలోని భారత దౌత్యకార్యాలయం సూచించింది. కరీంనగర్‌కు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి కోసం కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్‌ స్కాంలకు పాల్పడే చైనా వారి చేతిలో బందీలుగా మారిన విషయం తెలిసిందే.

వారిని కాపాడాలంటూ ఎంపీ బండి సంజయ్‌ విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఆయన ఫిర్యాదుకు ఈ నెల 19న ‘కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి’అన్న శీర్షికన ప్రచురితమైన ‘సాక్షి’కథనాన్ని జోడించారు. కాంబోడియా రాజధాని పెనామ్‌ పెన్‌లోని భారత రాయబార కార్యాలయం దీనిపై స్పందించి గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాంబోడియాకు వస్తున్న భారతీయులు మానవ అక్రమ రవాణా, ఇతర అసాంఘిక ముఠాల చేతుల్లో ఇబ్బందులు పడుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించింది. భారత్‌ నుంచి వచ్చే నిరుద్యోగులు టూరిస్టు వీసాలపై ఉపాధి కోసం పంపించే ప్రయత్నాలను ప్రోత్సహించవద్దని స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు