క్షణక్షణం.. భయంభయంగా గడిపాం 

21 Aug, 2021 00:53 IST|Sakshi
ఐటీబీపీ సైనికుడిగా ఎంబడి సురేశ్‌ 

అఫ్గాన్‌ పరిస్థితులపై ఇండియన్‌ ఎంబసీ సెక్యూరిటీ కమాండో సురేశ్‌ 

తిండి, తాగునీరులేక రెండ్రోజులు ఇబ్బందులు పడ్డాం  

అన్ని దేశాల ఎంబసీలు వెళ్లిపోయిన తర్వాతే ఇండియన్‌ ఎంబసీ వచ్చేసింది 

లక్సెట్టిపేట(మంచిర్యాల): ‘‘తాలిబన్ల చేతిలోకి అఫ్గానిస్తాన్‌ వెళ్లడంతో అక్కడ ఉంటున్న భారతీయులు చాలా ఇబ్బందులుపడ్డారు. ఇండియన్‌ ఎంబసీలో కమాండోలుగా ఉన్న మేం కూడా అవస్థలు పడ్డాం. తాలిబన్లకు అధికారం రావడంతో ఇండియన్‌ ఎంబసీని పట్టించుకునేవారే కరువయ్యారు. చివరి రెండ్రోజులు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. తాగడానికి నీరు, తినడానికి తిండి, ఏ ఇతర సౌకర్యాలనూ తాలిబన్లు కల్పించలేదు’’అంటూ అక్కడి ఇండియన్‌ ఎంబసీ సెక్యూరిటీ కమాండోగా విధులు నిర్వర్తించిన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ఎంబడి సురేశ్‌ తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించారు.

‘‘నిత్యం అధికారులకు రక్షణ కల్పించడంలో ఇబ్బందులుండేవి. ఎప్పుడేం జరుగుతుందోనని క్షణక్షణం భయంభయంగా గడిపేవాళ్లం. ఎటు నుంచి దాడులు, బాంబులు పడతాయోనని అప్రమత్తంగా ఉండేవాళ్లం. అన్ని దేశాల ఎంబసీలు వెళ్లిపోయిన తర్వాతే, చివరగా ఇండియన్‌ ఎంబసీ ఇక్కడికి వచ్చేసింది. అప్పటివరకు విధుల్లో నిర్విరామంగా ఉన్నాం. ఇండియన్‌ ఎంబసీ తీసుకున్న నిర్ణయంతో 130 మంది కమాండోలు, 70 మంది భారతీయులతో సీ–17 బోయింగ్‌ ఎయిర్‌ఫోర్స్‌ యుద్ధ విమానంలో 17న ఢిల్లీకి చేరుకున్నాం’’అని సురేశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని హెడ్‌ ఆఫీస్‌ క్యాంపు భవ నంలో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు