భద్రాద్రిలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం

21 Apr, 2021 11:49 IST|Sakshi

సాక్షి, భద్రాచలం: భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్ దంపతులు సమర్పించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వేదపండితులు సీతారాముల కల్యాణ ఘట్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిజిత్ ల‌గ్నంలో సీతారాముల క‌ల్యాణ వేడుక క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ఈ క‌మ‌నీయ కల్యాణ వేడుక శ్రీరాముని భ‌క్తులను ఆనంద పార‌వ‌శ్యంలో ముంచెత్తింది.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఇతర ప్రజాప్రతినిధులు కూడా కల్యాణ వేడుకకు హాజరయ్యారు. కరోనా కారణంగా రెండో ఏడాది ఆంతరంగికంగా రాములోరి కల్యాణం జరుగుతోంది. కరోనా తీవ్రత దృష్ట్యా భక్తులకు అనుమతి నిరాకరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. వరుసగా రెండో ఏడాదీ భక్తుల లేకుండా స్వామివారి కల్యాణం ఘట్టం పూర్తయింది. రేపు (గురువారం) శ్రీరాముని మహాపట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది.

చదవండి: శ్రీరామనవమి ఇంట్లో ఎలా జరుపుకోవాలో తెలుసా?

మరిన్ని వార్తలు