ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష

18 Mar, 2023 11:14 IST|Sakshi

వరంగల్: వారిద్దరూ దూరపు బంధువులు.. ఓ వివాహ వేడుకలో కలిశారు. హనుమకొండలో ఉంటూ వేర్వేరుగా ప్రైవేట్‌గా ఉద్యోగాలు చేసే వారు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఆ యువకుడు కన్పించకుండా పోయాడు. దీంతో తనను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని పట్టుబట్టిన యువతి సదరు యువకుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బయన హరిశంకర్‌ హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన అనుశెట్టి సుప్రియ ప్రేమించుకుని, పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో హరిశంకర్‌ అదృశ్యమయ్యాడు.

 దీంతో సుప్రియ ప్రియుడి గ్రామానికి చేరుకుని శుక్రవారం దీక్షకు దిగింది. తల్లిదండ్రుల మాటలు విని నన్ను దూరం చేస్తున్నాడని, న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని సుప్రియ పేర్కొంటూ కన్నీటి పర్యంతమైంది. హరిశంకర్‌ పెళ్లి చేసుకోవడం లేదని హనుమకొండలోని పోలీస్‌ స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని దీంతో అతని ఇంటివద్ద దీక్ష చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రియుడితో మాట్లాడే ప్రయత్నం చేయగా సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉంది. స్థానిక ఎస్సై రాజును వివరణ కోరగా.. యువతికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించినట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు