ఓయూలో ఇండో–పసిఫిక్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

5 Sep, 2021 08:53 IST|Sakshi

 విదేశాంగ శాఖతో చర్చలు 

సాక్షి, న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండో –పసిఫిక్‌ స్టడీస్‌ కేంద్రం ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమా ర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఉస్మానియా వర్సిటీ ప్రతినిధులు ఈ అంశంపై శనివారం ఢిల్లీలో విదేశాంగ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం అధికారులతో చర్చించారు. ప్రతినిధి బృందంలో ఉన్న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకటరమణ, ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ డి.రవీందర్‌లు ఇండో పసిఫిక్‌ స్టడీస్‌కు ఉస్మానియా అనుకూలంగా ఉంటుందని విదేశాంగ శాఖకు వివరించారు.

కాగా, ఈ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందిస్తామని విదేశాంగ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఓయూ పరిధిలోని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ (ఓయూసీఐపీ)లో ఇండో పసిఫిక్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ అధికారులు ఓయూను సందర్శించాక ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహణకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు.   

సామాజిక న్యాయ శాఖ నుంచి నిధులు
వర్సిటీలోని సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, వసతి గృహాలకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ నుంచి నిధుల కేటాయింపునకు ఆ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.సుబ్రమణ్యం హామీ ఇచ్చారని ఓయూ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు