HYD: అతిపెద్ద సైబర్ స్కాం గుట్టురట్టు.. ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌కార్డు, లోన్‌ డేటా..

23 Mar, 2023 14:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సైబర్‌ క్రైమ్‌ స్కామ్‌ను బయటపెట్టారు. దేశంలో కోట్లాది మంది పర్సనల్‌ డేటాను అమ్మకానికి పెట్టిన సైబర్‌ దొంగలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా 16 కోట్ల మంది దేశపౌరుల డేటా అమ్మకానికి గురైనట్టు వివరించారు. 

వివరాల ప్రకారం.. డేటాను చోరీ చేస్తూ అమ్ముతున్న సైబర్‌ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. డేటా దొంగతనంపై హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలో సైబరాబాద్‌ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేసినట్టు సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. కాగా, వీరిని ఢిల్లీ, నాగపూర్‌, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయ్యింది. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్‌ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్‌ మీడియా ఐడీలు, పాస్‌వర్డ్‌లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. 

ఈ ముఠా సభ్యులు ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌కార్డులు, లోన్‌ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్‌ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్‌ చేశామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: గుట్టుగా అబార్షన్ల దందా! రూ.30వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్ష

మరిన్ని వార్తలు